అసలేం జరిగింది? ఈడీ ఎందుకీ ప్రకటన చేసింది?
ఇటీవల అహ్మదాబాద్కు చెందిన ఒక బడా స్థిరాస్తి సంస్థ ఖాతాదారుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. కానీ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఈడీ విచారణలో తేలింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఏకంగా రూ. 129.80 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ భారీ జప్తు నేపథ్యంలోనే ... దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ కస్టమర్లను అప్రమత్తం చేస్తూ ఈడీ కీలక సూచనలు జారీ చేసింది.
ఉపేక్షించవద్దు ... తక్షణం ఫిర్యాదు చేయండి
ఏదైనా ప్లాట్ లేదా ఫ్లాట్ కొంటున్నప్పుడు, బిల్డర్లు లేదా రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే భయపడవద్దని, వెంటనే ఫిర్యాదు చేయాలని ఈడీ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా కింది సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలి.
ప్రతి ప్రాజెక్టుకు స్థిరాస్తి నియంత్రణ సంస్థ (రెరా) రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆ నెంబర్ అడిగినప్పుడు బిల్డర్ దాటవేసినా, ఇవ్వడానికి నిరాకరించినా సదరు సంస్థపై ఫిర్యాదు చేయాలి.
ముందుగా డబ్బులు కట్టించుకుని, అగ్రిమెంట్ ప్రకారం సమయానికి రిజిస్ట్రేషన్ చేయకుండా రోజుల తరబడి ముప్పుతిప్పలు పెడుతున్న బిల్డర్లపై చర్యలు తప్పవు.
లావాదేవీల్లో ఎక్కువ భాగం “నగదు” రూపంలోనే ఇవ్వాలని పట్టుబట్టినా అది చట్టవిరుద్ధమే.
ఏవైనా కారణాల వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నా లేదా ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయినా ... కట్టిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా వేధిస్తుంటే కంప్లైంట్ చేయొచ్చు.
విక్రయించాల్సిన ఆస్తిని, మీకు తెలియకుండా మరొకరికి అమ్మే ప్రయత్నం చేసినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
నగదు లావాదేవీలు ... కొనుగోలుదారుల పాలిట ఉరితాడు!
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత లోపించడం వల్ల ఒకప్పుడు ఎంతో మంది మోసపోయి రోడ్డున పడ్డారు. అందుకే కొనుగోలుదారుల రక్షణ కోసం ప్రభుత్వం ‘రెరా’ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ‘రెరా’లో రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్ అంటే దానికి చట్టబద్ధత ఉన్నట్లు లెక్క. ఆ వివరాలు దాస్తున్నారు అంటేనే... ఆ ప్రాజెక్టులో ఏదో లోపం ఉన్నట్లు లేదా ప్రభుత్వ అనుమతులు లేనట్లు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి కోసం “నగదు” రూపంలో లావాదేవీలు జరపమని అడగడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉంటుందని ఈడీ హెచ్చరిస్తోంది. ఇలా చేయడం ద్వారా బిల్డర్లు బ్లాక్ మనీని ప్రోత్సహించడమే కాకుండా ... భవిష్యత్తులో ఆ ప్రాజెక్టులో ఏదైనా వివాదం వస్తే, కస్టమర్ వద్ద తాను డబ్బు కట్టినట్లు ఎలాంటి బ్యాంక్ ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఇది అంతిమంగా వినియోగదారుల పాలిట ఉరితాడుగా మారుతోంది.
అప్రమత్తతే శ్రీరామరక్ష
కాబట్టి వినియోగదారులు ప్రాపర్టీ కొనే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ప్రాపర్టీ కొనే ముందు వారి ‘రెరా’ రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగి తీరాలి. ఆన్లైన్లో ఆ నెంబర్ ఎంటర్ చేసి, ప్రాజెక్ట్ వివరాలు సరిచూసుకోవాలి. హక్కుల పట్ల అవగాహన పెంచుకోండి. పారదర్శకత లేని లావాదేవీలను నిలదీయండి. ఎవరైనా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆధారాలతో సహా రాష్ట్రాల్లోని రేరా, వినియోగదారుల కమిషన్లకు ఫిర్యాదు చేయడానికి ఏమాత్రం వెనుకాడవద్దు.







